Search This Blog

Tuesday, March 20, 2012

తెలుగువారి చరిత్ర



ఆంధ్రుల చరిత్ర


పూర్వ యుగము

            మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోదిగా భావించబడుతున్న ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు, శునస్సేపుడు కధలో ఉంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద జాతులతో కలిసి ఆర్యావర్తం దక్షిణాన నివశిస్తున్నట్లు అర్ధం చెప్పుకోవచ్చును. మహాభారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన ఉన్నట్లు (ఆంధ్రాశ్చ బహవః) ఉన్నది.

            క్రీ.పూ. 600 - జైన, బౌద్ధ మతాల ఆరంభం భారత దేశ చరిత్రలో ఒక ప్రభంజనం.మొదటినుండీ ఈ మతాలు ఆంధ్రదేశంలో విస్తరించాయి. ఈ కాలంలో ఉత్తర, దక్షిణ దేశాల మధ్య సంబంధం పెరిగింది. క్రీ.పూ. 500 - 400 - బౌద్ధ జాతక కధలలో ఆంధ్రాపధం (భీమసేన జాతకం) , ఆంధ్రనగరి (సెరివణిజ జాతకం) ప్రస్తావన ఉన్నది. భట్టిప్రోలు శాసనం ద్వారా క్రీ.పూ. 400 నాటికి కుబ్బీరుడు (యక్షరాజు) తీరాంధ్రంలో రాజ్యం చేస్తున్నాడు. అయితే పెద్దయెత్తున ఔత్తరాహులు ఆంధ్రాపధంపై దండెత్తిన ఆధారాలు లేవు. కొద్దిపాటి ఘర్షణలు జరిగి ఉండవచ్చును. క్రీ.పూ. 300 నాటికే బౌద్ధం, జైనం ఆంధ్రాపధంలో అమితంగా ఆదరణ పొందాయి.


మౌర్యకాలము క్రీ.పూ.322 - 184

            చంద్ర గుప్తుడు క్రీ.పూ. 322లో మౌర్య వంశం స్థాపించాడు. క్రీ.పూ. 300 - మెగస్తనీసు చంద్రగుప్తుని ఆస్తానంలో ఉన్న యాత్రికుడు. ఆంధ్రుల గురించి ఇలా వ్రాశాడు - "ఆంధ్రులకు 30 నగర దుర్గాలు, 10 వేల పదాతి సైన్యం, 2వేల గుర్రపు దళం, వేయి ఏనుగులు ఉన్నాయి" క్రీ.పూ. 272 - క్రీ.పూ.232 అశోకుని పాలన కాలం. అశొకుని 13వ శిలాశాసనం ప్రకారం ఆంధ్రులు "రాజవిషయం"లో ఉన్నారు. క్రీ.పూ.400 - 200 సమయంలో బౌద్ధమతం ఆంధ్రదేశంలో అంతటా ఉచ్ఛదశలో ఉంది. ఆంధ్రుల ఏకీకరణకు మార్గం సానుకూలమయ్యంది. ఈ సమయంలో ఇనుము పరిశ్రమ, వ్యవసాయం, వాణిజ్యం బాగా అభివృద్ధి చెంది దేశం సుభిక్షమయ్యింది. ఉత్తర దేశంనుండి సింహళానికి వెళ్లేమార్గంలో ఆంధ్రదేశం ముఖ్యమైన మజిలీగా ఉండేది.

శాతవాహనులు - క్రీ.పూ.200 - క్రీ.శ.200

              మౌర్య సామ్రాజ్యం పతనమైన తరువాత శాతవాహనులు విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరి పాలన క్రీ.పూ. 2వ శతాబ్ది నుండి క్రీ.శ.2వ శతాబ్ది వరకు షుమారు 400 సంవత్సరాలు సాగింది. షుమారు క్రీ.పూ. 271-248 మధ్య సిముకుడు అనే రాజు అప్పటి ఆంధ్రరాజ్యాలనన్నింటినీ ఏకం చేసి రాజై శాతవాహనుల వంశాన్ని స్థాపించాడు. అతని మొదటి రాజధాని అమరావతి వద్ద ధరణికోట కావచ్చును. తరువాత మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం (ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్)కు రాజధాని మార్చబడింది. వీరిలో ఆరవ రాజైన రెండవ శాతకర్ణి (క్రీ.పూ.184) గొప్ప రాజు. నందులు, మౌర్యులు, శుంగులు, కణ్వులు తరువాత విశాల భారత సామ్రాజ్యాన్ని శాతవాహనులు సాధించగలిగారు. క్రీ.శ.62లో అధికారానికి వచ్చిన 23వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహనుల ప్రాభవం తిరిగి పుంజుకుంది. నాసిక్ శాసనం ప్రకారం ఇతని రాజ్యంలో అసిక, అస్సక, ములక, సౌరాష్ట్ర, కుకుర, అపరాంత, అనూప, విదర్భ, అకర, అవంతి దేశాలూ మరియు వింధ్య, అచవత, పారియాత్ర, సహ్య, కన్హగిరి, సిరితన, మలయ, మహేంద్ర, శత, చకోర పర్వతాలూ ఉన్నాయి (దక్షిణ ప్రాంతమే కాక గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాలు). అతని రాజ్యం తూర్పు సముద్రం నుండి పశ్చిమ సముద్రం వరకు విస్తరించింది. క్రీ.శ. 2వ శతాబ్దానికి శాతవాహనుల సామ్రాజ్యం పూర్తిగా పతనమయ్యింది.

                శాతవాహనుల కాలంలో దేశాంతర వాణిజ్యం బాగా సాగింది. తీరాంధ్ర, కళింగ ప్రాంతాలలోని అనేక రేవులు, కృష్ణా గోదావరి మధ్య ప్రాంతంలో పెక్కు నగరాలు వాణిజ్యకేంద్రాలుగా విలసిల్లాయి. చేతిపనులు అభివృద్ధి చెందాయి. రాజులు వైదిక మతాన్ని అవలంబించినా గాని బౌద్ధం కూడా వర్ధిల్లింది. రెండు మతాలనూ రాజులు ఆదరించారు. అనేక గొప్ప చైత్యాలు, స్తూపాలు, విహారాలు నిర్మింపబడ్డాయి. సాహిత్యం, శిల్పం కూడా ప్రభవించాయి. ఈ కాలంలో బౌద్ధమతంలో జరిగిన మరొక విశేష తత్వశాస్త్ర వికాసం ఆచార్య నాగార్జునుడు బోధించిన మహాయానం.

కళింగులు క్రీ.పూ. 200 - క్రీ.శ.420

                  మహానది, గోదావరి నదుల ముఖ ద్వారాల మధ్య భాగాన్ని కళింగ దేశమని చెప్పవచ్చును. కళింగులు నేటి ఉత్తరాంధ్ర, ఒరిస్సా ప్రాంతాలను పాలించిన రాజులు.


              తొలి శాతవాహనులకు సమకాలికులుగా కళింగ దేశాన్ని ఛేది (సద) రాజులు పాలించారు. వీరిలో ప్రసిద్ధుడు ఖారవేలుడు. అశొకుని సామ్రాజ్యం క్షీణించిన తరువాత క్రీ.శ. 183లో ఖారవేలుడు కళింగ రాజయ్యాడు. ఖారవేలుడు జైన మతస్థుడు. వృషభ లాంఛనుడు. సమర్ధుడైన పాలకుడు. రాజ్యవిస్తరణ చేశాడు. ఇతని రాజధాని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి వద్దనున్న ముఖలింగం. ఖారవేలునికి శాతవాహనులలో సమకాలీనుడు శాతకర్ణి. వారి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో "పిథుండ" నగరాన్ని ఖారవేలుడు నాశవం చేశాడని హథీగుంఫ శాసనం (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది.
    
                  ఖారవేలుని తరువాత కళింగ రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయింది. తరువాతి కాలంలో కొంతకాలం పిష్ఠపురంలో మాఠరులు అధికారంలో ఉన్నారు (క్రీ.శ.400-450). దేవపురిలో వాసిష్ఠులు పాలించారు (క్రీ. శ. 300-450).

ఇక్ష్వాకులు క్రీ. శ. 225 - 300

                   శాతవాహనుల పతనం తరువాత తీరాంధ్రప్రాంతంలో ఇక్ష్వాకులు నాగార్జునకొండ వద్ద విజయపురి రాజధానిగా 50 సంవత్సరాలు పాలించారు. ఇక్ష్వాకులు క్రీ.శ.225 ప్రాంతంలో విజృంభించారు. మొదటివాడైన శ్రీ ఛాంతమూలుడు (క్రీ. శ. 225-245) గొప్ప వీరుడు. ఇతడు రాజనీతిపరుడు. ఇతని కాలంలో వైదికమతం పునరుద్ధరణ పుంజుకొంది. తరువాత వీరపురుషదత్త (క్రీ. శ. 245-265) కాలం ఆంధ్రబౌద్ధ చరిత్రలో సువర్ణఘట్టం. అతని రాణులు ఇతర అంతఃపుర స్త్రీలు పెద్దయెత్తున బౌద్ధారామాలకు దానాలు చేశారు. ఆ కాలంలో శ్రీపర్వతం (నాగార్జునకొండ) గొప్ప బౌద్ధక్షేత్రంగా విలసిల్లి దూరదేశాలనుండి యాత్రికులను ఆకర్షించింది. సింహళం, చైనా, కాశ్మీరం, గాంధారం, తొసలి, వనవాస, అపరాంతం, వంగ, యవన, తమిళ దేశాలనుండి వచ్చే యాత్రికులకోసం వారు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించారు. మాహదేవుడనే బౌద్ధభిక్షువు పల్లవబొగ్గ (పలనాడు)లో చాలాకాలం ప్రచారం చేసి, 14లక్షల 60వేల మంది భిక్షువులతో కలిసి సింహళదేశం వెళ్ళాడని మహావంశం అనే బౌద్ధగ్రంధంలో ఉన్నది. ఇక్ష్వాకుల శాసనాలు శాతవాహనుల శాసనాలవలె అధికంగా ప్రాకృతంలోనే ఉన్నాగాని వాటిలో తెలుగు పదాల వినియోగం హెచ్చింది. సంస్కృతం కూడా చోటు చేసుకోసాగింది.

బృహత్పలాయనులు - క్రీ.శ. 275 ప్రాంతం

                   ఇక్ష్వాకుల రాజ్యము అంతరించిన తరువాత క్రీ. శ. నాలుగవ శతాబ్ది ప్రథమ పాదములో కృష్ణానది ఉత్తర తటప్రాంతమును బృహత్పలాయనులు పాలించారు. కొండముదిలో దొరికిన ప్రాకృత శాసనము ప్రకారము జయవర్మ కూదూరు (కృష్ణా జిల్లా, మచిలీపట్నం తాలూకా లోని గూడూరు)రాజధానిగా పాలించాడు. ఇతని మహాసైన్యాధిపతి భాపహానవర్మ "మహాతలవర" మరియు "మహాదండనాయక" అని చెప్పబడ్డాడు. నాగార్జునకొండ వద్ద దొరికిన ఒక ఇక్ష్వాకుల శాసనములో "బహఫల సగోత్తాయ సిరివమ్మ భటాయా" అని ఉన్నది. ఈమె కుటుంబమువాడే జయవర్మ అయిఉండవచ్చును. జయవర్మ తరువాత బృహత్పలాయన సగోత్రులు ఎవరైనా రాజ్యము చేశారేమో తెలియదు. వీరి రాజ్యము శాలంకాయనుల విజృంభణ వల్ల అంతరించి ఉండవచ్చును.

అనందగోత్రులు క్రీ.శ. 295 - 620

                చేజెర్ల లొ దొరికిన ఐదవ శతాబ్ది చివరికాలపు సంస్కృత శాసనము ప్రకారము అనంద మహర్షి గోత్రీకుడగు కందరరాజు ధాన్యకటక యుద్ధములో శత్రువులను జయించి త్రికూటపతి అయ్యాడు. ఈతని రాజ్యము కృష్ణానది దక్షిణ తీరము నుండి త్రికూట పర్వతము (కోటప్పకొండ) వరకు వ్యాపించి ఉన్నది. రాజధాని కందరపురము. ఇది గుంటూరు జిల్లా నర్సారావుపేట వద్దనున్న చేజెర్ల, చేబ్రోలు, కంతేరు లలో ఒకటి కావచ్చును. తరువాతి రాజులు దామోదరవర్మ, అత్తివర్మ. వీరు వైదికమతాభిమానులైనను బౌద్ధమును ఆదరించారు. బౌద్ధమత క్షీణదశ అప్పటికి ప్రారంభము కాలేదు. వీరికి పల్లవులతో యుద్ధాలు జరిగాయి. చాళుక్యరాజు సత్యాశ్రయ పులకేశి యొక్క సేనాపతి పృథ్వీయువరాజు దండెత్తినపుడు కందారరాజు చేత ఓడిపోయాడు. కాని తరువాతి దండయాత్రలో పులకేశి తమ్ముడు కుబ్జవిష్ణువర్ధనుడు స్థానిక రాజులందరిని ఓడించి ఆంధ్రదేశాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. తరువాత దక్షిణాంధ్రాన్ని పల్లవులు, కృష్ణామండలం ప్రాంతాన్ని శాలంకాయనులు ఆక్రమించారు. క్రీ. శ. అయిదవ శతాబ్ది చివరకు శాలంకాయనుల ధాటికి వీరి రాజ్యము అంతరించినది.

శాలంకాయనులు క్రీ. శ.300 - 420

                 "శాలంకాయన" అనేది గోత్రనామము. వీరు వేంగి రాజధానిగా గోదావరి, కృష్ణా జిల్లాలను పాలించారు. వీరు ఆనంద గోత్రజులకు ఇంచుమించు సమకాలికులు. వీరికాలంలో వేంగి నగరం గొప్ప విజ్ఞానకేంద్రంగా ఉండేది. వీరు వేంగిలో చిత్రరధస్వామిని ఆరాధించారు. గుంటుపల్లెలోని ఆరామాలకు భూరి విరాళాలిచ్చారు. హస్తివర్మ క్రీ.శ.320లో విజృంభించి వేంగి ప్రాంతంలోని ఇక్ష్వాకులను ఓడించి రాజ్యపాలన ప్రారంభించి ఉండవచ్చును. సముద్ర గుప్తుని దక్షిణదేశ దండయాత్రలగురించి అలహాబాదు ప్రశస్తిలో చెప్పబడిన వైగేయిక హస్తివర్మ ఇతడే. అంతర్యుద్ధాలవల్ల, ఉత్తరాన పిష్ఠపురంలో మాఠరులు, కర్మరాష్ట్రంలో విష్ణుకుండినులు బలవంతులై తరచు యుద్దాలు చేయడం వలన శాలంకాయనుల రాజ్యం పతనమయ్యింది. ఈ కాలంలో బౌద్ధం భారత దేశంలో క్షీణిస్తూ ఇతర దేశాలలో విస్తరించడం ప్రాంభమైంది.

విష్ణుకుండినులు క్రీ. శ. 375-613

                    శాలంకాయనులతరువాత వేంగీదేశమును విష్ణుకుండినులు క్రీ. శ. 375 నుండి క్రీ. శ. 613వరకు పాలించారు. విష్ణుకుండినుల రాజ్యము తూర్పున విశాఖపట్టణము మొదలుగ పడమట గుంటూరు వరకును, నైరుతిన గోలకొండ వరకు విస్తరించిఉన్నది. సంస్కృత భాషను ఆదరించారు. వైదిక సంస్కృతికి పట్టుకొమ్మలై వేదవిద్యలు పోషించారు. విష్ణుకుండినులు మతసహనము గలవారు. ప్రజలలో అప్పటికి ఆదరణపొందుచుండిన బౌద్ధమతాన్ని ఆదరించారు. గుహాలయములు నిర్మించి గుహాలయ వాస్తువుకు ప్రోత్సాహమిచ్చారు. మొగల్రాజపురము, ఉండవల్లి గుహాలయాలు వీరు నిర్మించినవే. విష్ణుకుండినులు రాగిమలాము చేసిన ఇనుప నాణెములు వాడారు. భారతదేశములో ఇలాంటి నాణెములు తొలుతగా ప్రవేశబెట్టినవారు విష్ణుకుండినులు. విష్ణుకుండినుల రాజధాని "ఇంద్రపురం" ప్రస్తుత నల్గొండ జిల్లా (రామన్నపేట తాలూకా) ఇంద్రపాలగుట్ట కావచ్చునని ఒక అభిప్రాయం.

                     క్రీ. శ. 514 నాటికి గోదావరికి ఉత్తరాన కళింగ రాజ్యం వేరయ్యింది. కృష్ణానది దక్షిణ భాగం పల్లవుల వశమయ్యింది. కృష్ణా గోదావరి మధ్యభాగం విష్ణుకుండినుల పాలనలో ఉంది. పశ్చిమాన ప్రస్తుత తెలంగాణా ప్రాంతం వాకాటకుల పాలనలో ఉంది. ఈ పరిస్థితి 7వ శతాబ్దం వరకు కొనసాగింది.

పల్లవులు

                    సాతవాహనాంతరికులలో తక్కిన రాజవంశములలో వైశాల్యమున అధికతరమగు రాజ్యమును దీర్ఘ కాలము పాలించిన వారు పల్లవులు. ఉచ్చదశలో కృష్ణానది ఉత్తరపు ఎల్లగా, కావేరీనది దక్షిణపు సరిహద్దుగా వర్తించాయి. ఆంధ్ర-తమిళ ప్రాంతమునే గాక కర్ణాట ప్రాంతముపై కూడ కొంతకాలము ఆధిపత్యము నిర్వహించారు.
పూర్వమధ్య యుగము

పూర్వమధ్య యుగము

మహాపల్లవులు

                6వ శతాబ్దం చివరి భాగంలో పల్లవుల రాజ్యం తిరిగి బలపడింది. కంచి కేంద్రంగా సింహవిష్ణు నాయకత్వంలో వర్ధిల్లిన ఈ వంశాన్ని అనంతర పల్లవులు లేదా "మహా పల్లవులు" అంటారు. వీరిలో వీరకుర్చుడు మొదటి రాజు. త్రిలోచన పల్లవుడు అందరికంటే ప్రసిద్ధుడు. మంచికల్లు (మాచర్ల వద్ద) లభించిన శాసనం పల్లవుల గురించి తెలిపే మొదటి ఆధారం. క్రీ. శ. 600-630 ప్రాంతంలో సింహవిష్ణు కొడుకైన మహేంద్రవర్మ కృష్ణానది దక్షిణ భాగాన్నంతటినీ జయించాడు. విస్తరణ దశలో ఉన్నరెండు వంశాలైన పల్లవులకూ, చాళుక్యులకూ మధ్య అధిపత్యం కొరకు తీవ్రమైన యుద్ధాలు జరిగాయి. కాని బాదామి చాళుక్యుల రాజ్యాన్ని పశ్చిమాన రాష్ట్రకూటులు అంతం చేయడంతో పల్లవుల రాజ్యం సుస్థిరమయ్యే అవకాశం లభించింది. 9వ శతాబ్దం వరకు పల్లవుల పాలన సాగింది. తరువాత తంజావూరు చోళులు వారిని జయించి కాంచీపురాన్ని ఆక్రమించారు.

రేనాటి చో(డు)ళులు

                 రేనాడు అని వ్యవహరింపబడిన (కడప మండలములోని పులివెందుల, అమలాపురము, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు తాలూకాలు, చిత్తూరు మండలములోని మదనపల్లి, వాయల్పాడు తాలూకాలు) దేశ విభాగములో తెలుగు భాష శాసనభాషగా పరిణతి చెందింది. క్రీ. శ. ఆరవ శతాబ్దమునుండి తొమ్మిదవ శతాబ్దము వరకు చోళవంశమునకు చెందిన ఒక శాఖ ఈ ప్రాంతములో రాజ్యం చేసి క్రమంగా ఏరువ, పొత్తపి, నెల్లూరు, కొణిదెన, నిడుగల్లు, కందూరు అను ప్రాంతీయ వంశములుగా ఏర్పడ్డారు.

చాళుక్యులు

                వీరు తొలుత విజయపురి ఇక్ష్వాకు రాజులకడ సామంతులుగా వుండి రాయలసీమ ప్రాంతమములోని చాళుక్యవిషయమును పరిపాలించారు[3]. తూర్పుననున్న పల్లవుల ధాటికి తాళలేక కర్ణాట రాజ్యము ప్రవేశించి కదంబులనోడించి ఒక మహాసామ్రాజ్యసంభూతులైరి. చాళుక్యులకెల్ల మూలమైనది బాదామి రాజవంశము. క్రీ.శ. 624 సంవత్సరములో పులకేశి వేంగి, కళింగ రాజ్యములు జయించి తన తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుని వేంగిలో పట్టాభిషిక్తుని గావించి, కమ్మనాడు వైపు మరలి చిరకాలశత్రువులగు పల్లవులను దక్షిణమునకు తరిమివేశాడు. క్రీ. శ. 755లో చాళుక్యసామ్రాజ్యమంతరించువరకు పల్లవులతో ఎడతెగని యుద్ధాలు సాగాయి. ఆంధ్రదేశములో మాత్రము తూర్పు చాళుక్యులపేర క్రీ. శ. 1076 వరకు స్థిరముగా పాలించారు.

               ప్రధానమైన చాళుక్య రాజ్యాలే కాకుండా ప్రస్తుత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలోని ప్రాంతాన్ని వేములవాడ రాజధానిగా పాలించిన వంశాన్ని వేములవాడ చాళుక్యులు అంటారు. 755-968 మధ్య కాలంలో వీరు రాష్ట్రకూటులకు నామమాత్రపు సామంతులుగా ఉన్నారు. మిగిలిన చాళుక్యులు చంద్రవంశపు రాజులమని చెప్పుకొనేవారు. కాని వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులలాగా తమది సూర్యవంశమని చెప్పుకొన్నారు.

రాష్ట్రకూటులు

                రాష్ట్రకూట వంశము బహు ప్రాచీనమైనది. క్రీ.శ. 6వ శతాబ్దము నుండియు ఈవంశపు రాజులు దక్షిణ హిందూదేశమున పెక్కుచోట్ల చిన్నచిన్న సంస్థానములు స్థాపించి పాలన చేయుచుండిరి. వీరు తొలుత చాళుక్యులకు సామంతులు. ఇప్పటి మహారాష్ట్ర లోని ఎల్లోరా ప్రాంతమునేలుచున్న దంతిదుర్గుడు బాదామి చాళుక్యుల కడపటి రాజు రెండవ కీర్తివర్మను కూలద్రోసి రాజ్యము చేశాడు. ఇతనిని దంతివర్మ అని కూడ అందురు. అద్వితీయ బల పరాక్రమ సంపన్నుడు. ఖడ్గావలోక, వైరమేఘ అను బిరుదులున్నాయి. క్రీ.శ. 758లో యుద్ధములో మరణించాడు. రాజ్యము చేసిన కొద్దికాలములోనే కాంచీ, కళింగ, కోసల, శ్రీశైల, మాళవ, లాట, టంక, సింధుదేశములను జయించాడు. ఇతనికి వేములవాడ చాళుక్య వంశమునకు మూలపురుషుడైన వినయాదిత్య యుద్ధమల్లుడు తోడ్పడ్డాడు.

పూర్వ చాళుక్యులు


                    తూర్పుచాళుక్యులు వేంగి రాజధానిగా 7వ శతాబ్దములో తీరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన రాజవంశము. ప్రసిద్ధి గాంచిన బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి (క్రీ.శ.608–644) తూర్పు దక్కన్ ప్రదేశాన్ని(ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలను) క్రీ.శ. 616 సంవత్సరంలో, విష్ణుకుండినులను ఓడించి, తన అధీనంలోకి తీసుకొన్నాడు. రెండవ పులకేశి సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడు అక్కడ తన అన్న అనుమతితో స్వతంత్ర రాజ్యం ఆరంభించాడు. క్రమంగా సంపదలు, సైనిక సంపత్తి ఏర్పరచుకొని వేంగి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చెయ్యగలిగారు. తరువాతి కాలంలో కుటుంబ కలహాల వల్ల, మరియు పొరుగు రాజ్యాలతో - ముఖ్యంగా రాష్ట్రకూటులు మరియు కళింగులతోను తరువాత చోళులతోను యుద్ధాలవల్ల వేంగి రాజ్యం క్రమంగా క్షీణించింది.

              తూర్పు చాళుక్యులు తెలుగు సాహిత్యానికి తొలిపలుకులు పలికారు. తొమ్మిదో శతాబ్దం రెండవ అర్థభాగంలో రెండవ విజయాదిత్యుని పరిపాలనాకాలంలో తెలుగులో కవిత్వం ప్రారంభం అయిందని అద్దంకి, కందుకూరులలో నున్న పాండురంగ శిలాశాసనాలు చెబుతున్నాయి. 11వ శతాబ్దంలో కవిత్రయంలో మొదటి వాడైన నన్నయ్య మహాభారతాన్ని తెనిగించడం ప్రాంరంభించాడు. ఇది తెలుగు సాహితీ రంగంలో ఒక సువర్ణ ఘట్టం. శైవం బాగా ప్రబలి ఉన్న రోజులు కావడంచేత తూర్పు చాళుక్యులు ఎక్కువగా శివాలయాలు నిర్మించారు.

పూర్వ గాంగులు

                   వేంగిలో తూర్పు చాళుక్యుల రాజ్యానికి సమాంతరంగా ఈశాన్యాన తూర్పు (పూర్వ) గాంగులు, దక్షిణాన పల్లవులు పరిపాలించారు. పూర్వ గాంగులు 5వ శతాబ్దం చివరలో ఒరిస్సా ప్రాంతంలో పాలకులుగా ఉన్నారు. ఆధారాలు లభించినంత వరకు ఆంధ్ర ప్రాంతపు మొదటి రాజు అనబడుతున్న ఇంద్రవర్మ (6వ శతాబ్దం) రాజధాని "దంతిపురం". తరువాత రాజధానిని కళింగ నగరం (శ్రీకాకుళం వద్దనున్న ముఖలింగం) కు మార్చబడింది. షుమారు 5 వందల సంవత్సరాలు గాంగుల పాలన ఈ ప్రాంతంలో సాగింది. తరువాత 11వ శతాబ్దం చివరిలో వారి రాజ్యానికి ఒరిస్సాలోని కటక్ ప్రధాన కేంద్రమయ్యింది.

చాళుక్య చోళులు

                   1వ రాజరాజ చోళుని (క్రీ. శ. 985 - 1016) నాయకత్వంలో దక్షిణాన చోళులు బలవంతమైన పాలకులయ్యారు. తూర్పు చాళుక్యుల అంతఃకలహాల కారణంగా శక్తివర్మ అనే రాజు వేంగి సింహాసనం సాధించడానికి రాజరాజచోళుని సహాయం అర్ధించాడు. ఇది అవకాశంగా రాజరాజు వేంగిని జయించి శక్తివర్మను వేంగికి పాలకుడిగా చేశాడు. తరువాత చోళులకు, కళ్యాణీ చాళుక్యులకు వేంగి రాజ్యం యుద్ధరంగమయ్యింది. వేంగి చాళుక్యులతో చోళులు వివాహ సంబంధాలు ఏర్పరచుకొన్నాక వారిని చాళుక్యచోళులు అని వ్యవహరిస్తున్నారు. చాళుక్య చోళ రాజు రాజేంద్రుడు క్రీ. శ. 1070లో 1వ కులోత్తుంగ చోళునిగా చోళసింహాసనం అధిష్టించాడు. క్రీ. శ. 1076వరకు వేంగిలో చాళుక్యచోళుల పాలన (చోళుల రక్షణ, అధీనంలో) సాగింది.

కాకతీయులు

                           కాకతీయ వంశము ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతమును క్రీ. శ. 1083 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము[1]. క్రీ. శ. 9వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని, జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే. కాకతీయుల కాలంలోనే ఆంధ్ర, త్రిలింగ పదాలు సమానార్థకాలై, దేశపరంగా, జాతిపరంగా ప్రచారంపొందాయి. వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదం ధరించినారు. వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్).
కాకతీయ సామ్రాజ్యంలో మూడు ముఖ్యమైన ఘట్టాలున్నాయి

క్రీ. శ. 1000 - 1158 - తెలంగాణ విమోచన:

                           ఈ దశలో నలుగురు రాజులు పాలించారు - కాకర్త్య గుండన, మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు, రెండవ ప్రోలరాజు - ఈ సమయంలో తెలంగాణ ప్రాంతం కాకతీయుల వశమయ్యింది. తెలుగునాట పశ్చిమ చాళుక్యుల పాలన అంతమయ్యింది. ముఖ్యంగా రెండవ ప్రోలరాజు పెద్ద రాజ్యాలకు ప్రతినిధులైన నలుగురు సామంతులను ఓడించి ఈ నిజయం సాధించాడు. అంతకు ముందు తీరాంధ్రంలో మాత్రమే స్వతంత్ర రాజ్యాలున్నాయి. కన్నడ ప్రాంతపు చాళుక్యులు, మహారాష్ట్ర నుండి రాష్ట్రకూటులు తీరాంధ్రంపై జరిగిన దండయాత్రలకు తెలంగాణా మార్గంగానే ఉంది. కనుక తెలంగాణ ప్రాంతంలో ఆర్ధిక, సాంస్కృతిక ప్రగతి కుంటువడి స్తబ్దంగా మారింది. ప్రజలలో పుట్టి కష్ట సుఖాలెరిగిన కాకతీయులు సాధించిన స్వతంత్రతతో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం, సాహిత్యం, వ్యాపారం ఒక్కమారుగా ఊపందుకొన్నాయి. ఇప్పటికీ కాకతీయులు త్రవ్వించిన చెరువులే చాలా మండలాలలో ముఖ్యనీటివనరులు.

క్రీ. శ. 1159 - 1261 తీరాంధ్రంలో విజయం : 

                                 ఈ దశలో కాకతీయులు ఉత్తరాన గంజాం నుండి దక్షిణాన కంచి వరకు జయించారు. రాయల సీమ, తెలంగాణ మరియు తీరాంధ్ర ప్రాంతాలు ఒక పాలనలోకి వచ్చాయి. ఈ దశలో ముగ్గురు పాలకులున్నారు. వారిలో గణపతి దేవుడు ప్రసిద్ధుడు. ఈ కాలంలో అన్ని ప్రాంతాల వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరిగాయి. కాని కులాల మధ్య విద్వేషాలు ఈ కాలంలో పెరగ సాగాయి.

క్రీ. శ. 1262 - 1323 సామ్రాజ్య పతనం: 

                                     ఈ సమయంలో రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు పాలించారు. ఇద్దరూ సమర్ధులైన ప్రభువులు మరియు యుద్ధ కోవిదులు, కాని ఉప్పెనలా ముంచుకొచ్చిన ఉత్తర దేశపు దండయాత్రల కారణంగా కాకతీయ సామ్రాజ్య పతనాన్ని ఆపలేకపోయారు. వివిధ కులాల మధ్య కలహాలు ఈ పతనానికి మరింత తోడ్పడ్డాయి.

అర్వాచీన గాంగులు

                         12వ శతాబ్దంలో అంతటా గందరగోళం నెలకొంది. కళ్యాణి చాళుక్యులు తూర్పు చాళుక్యులను జయించారు. 17 సంవత్సరాల తరువాత కళ్యాణి చాళుక్యులను చోళులు, వారి స్థానిక మిత్రులు కలిసి జయించారు. చందవోలు (గుంటూరు) ప్రాంతాన్ని చోళుల సామంతులు అయిన వెలనాటి చోళులు పాలించారు. క్రీ. శ. 1135-1206 కాలంలో వెలనాటి చోళుల నామమాత్రపు అధిపత్యంలో ఆంధ్రదేశాన్ని అనేక చిన్నచిన్న రాజకుటుంబాలు పాలించాయి. రాజకీయ, సాంఘిక కారణాల వల్ల వారి మధ్య జరిగిన ఘోరమైన యుద్ధమే పల్నాటి యుద్ధం.
ఉత్తరమధ్య యుగము

ఉత్తరమధ్య యుగము

ముసునూరి నాయకులు


               ప్రతాపరుద్రుని పరాజయము తరువాత ఆంధ్రదేశము అల్లకల్లోలమైనది. తురుష్కుల ఆగడాలు చెప్పనలవి గానివి. ప్రోలయనాయకుని విలస తామ్ర శాసనములో ఆనాటి తెలుగు వారి దయనీయ స్థితి వర్ణించబడింది. విషమ పరిస్థితులలో బెండపూడి అన్నయ మంత్రి మరియు కొలను రుద్రదేవుడను ఇద్దరు దేశాభిమానులు చెల్లాచెదరైన తెలుగు నాయకులను ఐక్యపరచి వారికి నాయకునిగా ముసునూరి ప్రోలానీడు అను మహాయోధుని ఎన్నుకొన్నారు. ప్రోలానీడు ఓరుగల్లు విముక్తి గావించుటకు పలు వ్యూహములల్లాడు. పెక్కు యుద్ధముల పిదప క్రీ. శ. 1326 లో తురుష్కులను దక్షిణభారతము నుండి తరిమివేయుటలో నాయకులు సఫలమయ్యారు. ప్రోలయనాయకుని మరణానంతరం క్రీ. శ. 1333లో కాపయనాయకుడు మళ్ళీ ఓరుగల్లు రాజయ్యాడు. హిందూమతము రక్షించబడింది. దేవాలయములు పునరుద్ధరించబడ్డాయి. బ్రాహ్మణులకు అగ్రహారములీయబడెను. అనితల్లి కలువచేరు శాసనములో ప్రోలానీడి వీరత్వము, దేశాభిమానము, ప్రజారంజకమగు పరిపాలన విపులముగా కొనియాడబడ్డాయి.

ఓఢ్ర గజపతులు, రేచెర్ల వెలమలు, కొండవీటి రాజ్యము, రాజమహేంద్రవర రాజ్యము

              ఇవన్నీ దాదాపు ఆంధ్ర దేశపు వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో నడచిన రాజ్యాలు. ముసునూరు నాయకులను తొలగించి రేచెర్ల నాయకులు రాజులయ్యారు. క్రీ. శ. 1325 నుండి 1474 వరకు తెలంగాణా మొత్తం వారి అధీనంలో ఉంది. రాజధాని రాచకొండ. తీరాంధ్ర దేశం క్రీ. శ. 1325 - 1424 మధ్య కాలంలో కొండవీటి రెడ్ల పాలనలో ఉంది. మొదట వారి రాజధాని అద్దంకి. తరువాత కొండవీటికి మార్చబడింది. అదే సమయంలో రాజమండ్రి ప్రాంతం ఇతర రెడ్ల పాలనలోకి వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రాంతం గజపతుల అధీనంలో ఉంది. ఒరిస్సా కటక్‌నుండి పాలిస్తున్న గజపతులు క్రీ. శ. 1448లో రాజమండ్రి రెడ్లను జయించారు. కాని క్రమంగా అన్ని ప్రాంతాలు విజయనగర రాజుల అధీనంలోకి వెళ్ళాయి. కొండవీటి రెడ్ల కాలంలోని ముఖ్య కవులు శ్రీనాధుడు, ఎర్రా ప్రగడ.

బహమనీ రాజ్యము


                 క్రీ. శ. 1323లో ఓరుగల్లు పతనానంతరం ఆంద్రులు మొట్టమొదటి సారిగా ముస్లిముల పాలనలోకి వచ్చారు. క్రీ. శ. 1347లో ఢిల్లీ సుల్తానులనుండి స్వాతంత్ర్యం ప్రకటించుకొని అల్లావుద్దీన్ హసన్ గంగు బహమనీ రాజ్యం స్థాపించాడు. క్రీ. శ. 1347 నుండి దాదాపు క్రీ. శ. 1425 వరకు బహుమనీల రాజధాని ఎహసానాబాద్‌ (గుల్బర్గా). ఆ తరువాత రాజధానిని మహమ్మదాబాద్‌ (బీదర్‌)కు తరలించారు. బహుమనీలు దక్కన్‌ మీద ఆధిపత్యానికై దక్షిణాన ఉన్న హిందూ విజయనగర సామ్రాజ్యముతో పోటీ పడేవారు. ఈ సల్తనత్ యొక్క అధికారము మహమూద్‌ గవాన్ యొక్క వజీరియతులో (క్రీ. శ. 1466–1481) ఉచ్ఛస్థాయి చేరుకొన్నది. క్రీ. శ. 1518 తర్వాత అంతఃకలహాల వలన బహుమనీ సామ్రాజ్యము ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విచ్ఛిన్నమైనది. ఆ ఐదు రాజ్యములు అహ్మద్‌నగర్ (నిజాం షాహి), బీరార్ (ఇమాద్ షాహి), బీదర్ (బారిద్ షాహి), బీజాపూర్ (అహమ్మద్ షాహి), మరియు గోలకొండ (కుతుబ్ షాహి) - ఇవి దక్కన్‌ సుల్తనత్ లుగా పేరు పొందాయి. వీటిలో కుతుబ్ షాహి వంశం ఆంధ్రుల చరిత్రలో ముఖ్యమైన ప్రభావం కలిగి ఉంది.

విజయనగర సామ్రాజ్యము

              విజయనగర సామ్రాజ్యానికి భారతదేశ చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావనియెల్లా తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన ధర్మము, సంస్కృతి, వేషభాషలు, ఆచారములు కనుమరుగై పోవు స్థితిలో హిందూమత సంరక్షణకు నడుముగట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా స్వరక్షణకై పోరాటములు సల్పి చాలావరకు కృతకృత్యులయిన దేశాభిమానుల చరిత్ర విజయనగర ఇతిహాసము. విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర (హక్క) మరియు బుక్క అనే అన్నదమ్ములు క్రీ. శ. 1336 లో స్ధాపించారు. వారి రాజధాని మొదట ఆనెగొంది. ఆనెగొంది ప్రస్తుతము తుంగభద్ర ఉత్తర తీరమున ఒక చిన్న పల్లె. సామ్రాజ్యము బుక్కరాయని పరిపాలనలో అభివృద్ధి చెందిన తరువాత రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరమున గల విజయనగరము నకు తరలించారు.

               తరువాత రెండు శతాబ్దాలలో, విజయనగర సామ్రాజ్యము యొక్క ఆధిపత్యము దక్షిణ భారత దేశమంతటా ప్రకాశించింది. యావద్భారత ఉపఖండములోనే విజయనగరము బలీయమైన రాజ్యంగా వెలిసింది. ఈ కాలంలో గంగా మైదానం నుండి వచ్చిన టర్కీ సుల్తానుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. దక్కను లోని ఐదుగురు సుల్తానుల నుండి నిరంతరంగా ఘర్షణలను ఎదుర్కొంది. ఒక బలీయమైన శక్తిగా నిలబడింది. శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఈ సామ్రాజ్యం ఉచ్ఛస్థితికి చేరింది. దక్కనుకు తూర్పున కొండవీడు, రాచకొండ, కళింగుల అధీనంలోగల ప్రాంతాలను, తమిళదేశమును వశపరచుకున్నాడు. సామ్రాజ్యపు గొప్ప గొప్ప నిర్మాణాలు ఆయన తోటే మొదలయ్యాయి. విజయనగరం లోని హజార రామాలయం, కృష్ణ దేవాలయం, ఉగ్ర నరసింహ మూర్తి విగ్రహం వీటిలో కొన్ని.

                      క్రీ. శ. 1530 లో అచ్యుతరాయలు ఆయనకు వారసుడయ్యాడు. క్రీ. శ. 1542 లో రామరాయలు గద్దెనెక్కాడు. ఇతడు దక్కను సుల్తానులను అనవసరంగా రెచ్చగొట్టి వారి శత్రుత్వం కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. క్రీ. శ. 1565 తళ్ళికోట యుద్ధంలో విజయనగర సైన్యాన్ని సుల్తానుల సమాఖ్య చిత్తుగా ఓడించారు. రాజధానిని ఆరు నెలలబాటు కొల్లగొట్టి, నేలమట్టం చేశారు. ఈ సామ్రాజ్యపు స్థాపన వివరాలూ, దాని చరిత్రలో ఎక్కువ భాగం అస్పష్టంగా ఉన్నాయి; కానీ దాని శక్తీ, అర్ధిక పుష్ఠి లను పోర్చుగీసు యాత్రికులైన డోమింగో పేస్‌, నూనిజ్‌ వంటి వారే కాక మరి కొందరు కూడా నిర్ధారించారు. విద్యా, సాంస్కృతిక పరంగా విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంగా పరిగణిస్తారు.
ఆధునిక యుగము




No comments:

Post a Comment